1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (10:05 IST)

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం గురువారం ఒక్క రోజు మాత్రమే జరుగనుంది. ఇందులో ఏకంగా 14 బిల్లులను ఆమోదించనున్నారు. వాస్తవానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ నిర్వహించాలనే నిబంధన ఉంది. దీంతో శాసనసభ గురువారం సమావేశం కానుంది. అయితే.. ఈసారి కూడా ఒక్కరోజుకే సభా వ్యవహారాలను పరిమితం చేయనున్నారని తెలిసింది. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన విష యం గమనార్హం. 
 
ఇక, తాజాగా నిర్వహించనున్న సభకు సంబంధించి సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై చర్చించాల్సి అంశాలను ఆమోదించనుంది. ఈ సమావేశానికి సీఎం జగన్‌, మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు పాల్గొనే అవకాశముంది. 
 
ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలో.. సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు.. చర్చించే అంశాలపై తీర్మానం చేయనున్నారు. కాగా, సాంకేతికంగా ఈ నెల 18లోగా శాసనసభను నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమైన బిల్లులు ఆమోదించుకోవాల్సి ఉన్నందున గురువారం ఒక రోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే నెల లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక మరోదఫా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.