దళిత డ్రైవర్ హత్య కేసు : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు
దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ప్రత్యేక కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయనకు గతంలో సుప్రీంకోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది.
అయితే, బెయిల్పై ఉంటూ ఆయన ఈ కేసులో నలుగురు కీలక సాక్షులను ప్రలోభపెట్టడం, హత్యా బెదిరింపులకు పాల్పడటం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాజమండ్రి ప్రత్యేక కోర్టు అనంతబాబు బెయిల్ను రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది.
సాక్షులను బెదిరించిన వ్యవహారంలో ఏప్రిల్ 24వ తేదీన సర్పవరం పోలీసులు అనంతబాబును అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ రద్దు కావడంతో ఇకపై హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన జైలులోనే ఉండనున్నారు. పోలీసుల తరపున స్పెషల్ పీపీ ముప్పాళ్ల సుబ్బారావు సమర్థవంతంగా వాదనలు వినిపించి, సాక్షుల బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
మరోవైపు, డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన ఈ దారుణ హత్య కేసులో విచారణ ఇకపై వేగవంతం కానుంది. కాగా, తన వద్ద పనిచేసే దళిత సామాజిక వర్గానికి చెందిన సుబ్రమణ్యాన్ని డ్రైవర్ అనంతబాబు హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తర్వాతి కథనం
