గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (10:19 IST)

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రపంచ రికార్డు దిశగా ఏపీ

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం ‘వ్యాక్సినేషన్ సండే’ పేరిట సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టి గరిష్ట స్థాయిలో ప్రజలకు టీకా డోసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 
 
కేవలం ఒక్క రోజులోనే 8 నుంచి 10 లక్షల డోసులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముందస్తుగా 14 లక్షల డోసుల వ్యాక్సిన్లను వివిధ జిల్లాల్లో సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్‌లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
 
కోవిడ్ విజృంభించిన సమయంలో ఆక్సిజన్‌ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన సర్కార్ … ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.
 
ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ అందించాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఒక్కరోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి ఏపీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోటి 22,83,479 వ్యాక్సిన్‌ డోసులను ప్రభుత్వం ప్రజలకు అందించింది. 
 
ఇప్పటివరకు 5,29,000 మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వ‌ర‌కు రెండు సార్లు ఒక్క‌రోజులో 6 ల‌క్ష‌ల కరోనా వాక్సిన్‌ డోస్‌లను వైద్య ఆరోగ్యశాఖ‌ అందించింది. ఇప్పటివరకు 26,41,739 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకాను వేసింది.
 
ఆదివారం మెగా డ్రైవ్‌ చేపడుతున్నట్లుగా కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని.. 8 లక్షల నుంచి 10 లక్షల మంది వరకూ వ్యాక్సిన్‌ వేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు.