గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 14 జూన్ 2014 (19:28 IST)

అక్టోబర్‌ 1 ఉదయం 5 గంటల 15 ని.కి 'గోవిందుడు...': బండ్ల గణేష్‌

బౌండెడ్‌ స్క్రిప్ట్‌ నా టేబుల్‌ మీదకు వచ్చాకే పొలాచ్చిలో సినిమా షూటింగ్‌ ప్రారంభించాను. సినిమా కథలో మార్పులు చేశారని, కృష్ణవంశీకి, రాజ్‌ కిరణ్‌కి మాటా మాటా వచ్చి అతన్ని తొలగించారని వస్తున్న వార్తలన్ని కేవలం పుకార్లు మాత్రమే. తెలుగు నేటివిటీ కోసం మేమంతా చర్చించుకుని ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నాం. చిరంజీవిగారు కథ ఓకే చేసి గోహెడ్‌ అన్నాకే మేం ముందడుగు వేశాం. ఆయనింకా మా సినిమా రష్‌ చూడలేదు అని నిర్మాత బండ్ల గణేష్‌ చెప్పారు.
 
విరామానికి కారణం, మధ్యలో మా హీరో జ్వరంతో బాధపడటం, 60 మంది ఆరిస్ట్‌లు, వాళ్ళలో చాలామంది చిన్న పిల్లలుండడం, వారిని మండుటెండల్లో కష్టపెట్టడం ఇష్టంలేక షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చాం. ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. జూలై 31 వరకు హైదరాబాద్‌లోనే షెడ్యూల్‌ జరుగుతుంది. ఆ తర్వాత లండన్‌లో షూటింగ్‌ చేస్తాం. ఆగస్ట్‌ 15కి సినిమా మొత్తం పూర్తవుతుంది. 
 
ముహూర్తం ప్రకారం అక్టోబర్‌ 1న... ఇప్పటికే యువన్‌ శంకర్‌రాజా మూడు పాటల్ని రెడీ చేశారు. ఒక పాట షూటింగ్‌ పూర్తయ్యింది. అక్టోబర్‌ 1 ఉదయం 5 గంటల 15 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నాం. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అని తెలిపారు. గోవిందుడు సినిమా 8 రోజులు రీషూట్‌కి అయిన ఖర్చును రాంచరణ్‌ భరిస్తున్నడానే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటేశారు బండ్ల గణేష్‌. 
 
కొరటాల శివ, రాంచరణ్‌ సినిమాకి కథ నచ్చకపోవడంతో దాన్ని నిలిపివేశాం. మంచి కథతో వీరిద్దరి కాంబినేషణ్‌లో సినిమా చేస్తా. పూరి జగన్నాధ్‌-ఎన్టీఆర్‌ సినిమా జూలైలో ప్రారంభమవుతుందని బండ్ల గణేష్‌ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం నాకు, నా బ్యానర్‌కి ఎంతో ప్రెస్టీజియస్‌ సినిమా. అందుకే ప్రతి విషయంలోని ఆచితూచి అడుగేస్తున్నాం. తొలుత రాంచరణ్‌కి తాతగా ప్రముఖ తమిళ నటుడు రాజ్‌కిరణ్‌గారిని తీసుకున్నాం. ఆయనపై చిత్రీకరణ కూడా చేశాం. తర్వాత ఆ పాత్ర తెలుగు నేటివిటీకి కనెక్ట్‌ కాదేమో అనే అనుమానం కలిగింది. 
 
అందుకే ఆయనతో మాట్లాడి ఆ ప్లేస్‌లో ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నాం. ఇందుకు రాజ్‌కిరణ్‌గారికి క్షమాపణ తెలుపుతున్నాను అని నిర్మాత బండ్ల గణేష్‌ చెప్పారు. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై రాంచరణ్‌, కాజల్‌ అగర్వాల్‌ నటీనటులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. ఈ సినిమాపై వస్తున్న కొన్ని వార్తలు కేవలం పుకార్లని బండ్ల గణేష్‌ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. 
 
బండ్ల గణేష్‌ మాట్లాడుతూ... కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న చక్కని తెలుగు చిత్రమిది. పదితరాల వారు గుర్తు పెట్టుకునేంత  అద్భుతంగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నారు. మా హీరో అందిస్తున్న సహకారం మరువలేనిది. ఇటువంటి కథ మళ్ళీ నా కెరియర్‌లో దొరకదని చాలా జాగ్రత్తలు వహిస్తు ఈ సినిమా తీస్తున్నాను. 
 
నా కెరియర్‌కి చాలా హెల్ప్‌ అయ్యే చిత్రమిది. రాజ్‌కిరణ్‌గారి స్థానంలో ప్రకాష్‌రాజ్‌గారిని తీసుకున్నాం. రాంచరణ్‌కి తాతగా ఆయన పాత్ర అద్భుతంగా వస్తోంది. సహజనటి జయసుధ ప్రకాష్‌రాజ్‌కి భార్యగా నటిస్తున్నారు. అమ్మలాంటి కమ్మనైన సినిమా ఇది. నేనే కాదు... తెలుగు ప్రేక్షకులు కూడా గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను.