1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (10:25 IST)

చైనా యాప్స్‌పై నిషేధం అంత ఈజీ కాదు సుమా? టెక్ నిపుణులు

దేశ సౌర్వభౌమత్వానికి, సమగ్రతకు హానికరంగా మారాయని పేర్కొంటూ చైనాకు చెందిన 59 రకాల సోషల్ మీడియా యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ఈ నిషేధాన్ని అమలు చేయడం అంత సులభతరం కాదని సైబర్ టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి తొలగించడం జరిగింది. కానీ, మొబైల్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరంతా వాడకుండా చూడటం అంత సులభమైన పనికాదు. 
 
గతంలో తమిళనాడులోని మదురై హైకోర్టు బెంచ్ టిక్ టాక్‌ను నిషేధించింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, అయినా యాప్‌ను కస్టమర్లు యధేచ్ఛగా వాడారని వెల్లడించారు. ఇక, ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు), టెలికం సంస్థలు సహకరిస్తే మాత్రం నిషేధాన్ని అమలు చేయవచ్చని, అందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కల్పించుకోవాలని సూచిస్తున్నారు. 
 
అప్పుడే నిషేధిత యాప్స్ ను స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నా పనిచేయవని అంటున్నారు. ఈ యాప్‌ను తెరవాలని చూస్తే, నిషేధం గురించిన సమాచారం మాత్రమే కనిపించేలా చూడాల్సి వుంటుందని సూచిస్తున్నారు.
 
ఇదిలావుంటే, ఈ 59 యాప్స్‌తో పాటు, మిగతా చైనా యాప్స్ సంగతేంటని, ఎంతో మందిని బానిసలుగా చేసుకుని ప్రాణాలు తీసిన పబ్‌జీ వంటి వాటిని ఎప్పుడు నిషేధిస్తారని పలువురు ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. 
 
చైనాకు చెందిన డజనుకు పైగా గేమింగ్ యాప్స్ ప్రమాదకరమని ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఇవి, ఫేస్‌బుక్, గూగుల్ లాగిన్‌తో పనిచేస్తూ, అక్కడి నుంచి సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. వీటిపై కూడా కేంద్రం దృష్టిసారించాలని నిపుణులు కోరుతున్నారు.