1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (18:20 IST)

కుంభకర్ణుడైనా ఆర్నెల్లే నిద్రపోతాడు.. ఈ జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయాడు : వైఎస్ షర్మిల

Sharmila
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పురాణా ఇతిహాసాల్లో కుంభకర్ణుడు కేవలం ఆరు నెలలు నిద్ర, ఆరు నెలలు మేల్కొనేవాడని పేర్కొన్నారని, కానీ, ఏపీ ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ళుగా నిద్రపోయాడంటూ పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, "ఈ ఐదేళ్ళలో వైకాపా ప్రభుత్వం ఎన్ని  ఉద్యోగాలు ఇచ్చివుండకూడదు? కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలల నిద్రపోయి, ఆరు నెలలు మేల్కొని ఉంటాడు. మరి జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు. ఇపుడు ఎన్నికలు వచ్చాయని నిద్రలేచారు. సిద్ధం ఉంటూ బయలుదేరారు. ఇంతకుముందు ఎపుడైనా జగన్ ఇలా జనాల్లోకి వెళ్లారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? అని అడిగారా? మీకు ఇళ్లు ఉన్నాయా అని అడిగారా? మరి ఇన్నేళ్లు ఏం చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు" అంట షర్మిల ధ్వజమెత్తారు. 
 
'న్యాయ రాజధాని అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పైగా, కర్నూలును స్మార్ట్‌ సిటీ చేస్తామన్నారు.. కనీసం మంచినీళ్లు లేవు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఏటా జనవరికి జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్నారు.. ఏదీ ఎక్కడా కనపడదే? ఆర్టీసీ, విద్యుత్‌తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారు. ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికా?.. దేనికి సిద్ధం?' అని షర్మిల ప్రశ్నించారు.  
 
రాష్ట్రంలో 2.30 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి... నేను అధికారంలోకి వచ్చాక అవన్నీ భర్తీ చేస్తాను అని జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పారని వివరించారు. ఐదేళ్లయినాగానీ ఆ రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ కాలేదని, మరి జగన్ ను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మి ఓటేస్తే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? అని నిలదీశారు. రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, ఈ ఐదేళ్లు ఎందుకు డీఎస్సీ వేయలేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన జగన్ ఎన్నికలకు రెండు నెలల ముందు 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ ప్రకటించారని షర్మిల మండిపడ్డారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే... వీళ్లకు పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్లకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా, చచ్చేదా? అని వ్యాఖ్యానించారు.