శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న అవినాష్

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది టీడీపీ పరిస్థితి. ఆ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైపోయింది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ పార్టీని వీడనున్నారు. అనుచరుల వత్తిడి మేరకు అవినాశ్‌ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం రాత్రి గుణదలలోని తన నివాసంలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాటకు కట్టుబడి పని చేసిన అవినాశ్‌కు పార్టీలో తగిన న్యాయం జరగలేదంటూ పలువురు అభిమానులు అగ్రహం వ్యక్తం చేశారు. 
 
అవినాశ్‌కు టీడీపీలో ప్రాధాన్యం దక్కకుండా కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు పార్టీ మారాలంటూ అవినాశ్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. 
 
ఎంత కష్టపడినా న్యాయం జరగని పార్టీలో కొనసాగినా విలువ ఉండదని వారు అభిప్రాయపడ్డారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకు దేవినేని అవినాశ్‌ టీడీపీ వీడి.. వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటునట్టు తెలిసింది.
 
బెజవాడ రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమదైన ముద్ర వేసుకున్న దేవినేని కుటుంబానికి చెందిన అవినాశ్‌ టీడీపీని వీడాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేవినేని నెహ్రూ రాజకీయ ప్రస్థానం టీడీపీ అవిర్భావంతోనే మొదలైంది. 
 
ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి మంత్రిగా పనిచేసిన నెహ్రూ రాజకీయ కారణాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడ ఇమడలేక తిరిగి టీడీపీలోకి వచ్చారు. చివరికి ఆయన జీవితం టీడీపీలోనే ముగిసింది. బెజవాడలో ఎంతోమంది రాజకీయ నాయకులకు గురువుగా గుర్తింపు తెచ్చుకున్న నెహ్రూ తనయుడు అవినాశ్‌ కూడా టీడీపీ యువ నాయకుడిగా విజయవాడ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. 

పార్టీలో ఆయన పనితీరును గుర్తించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ సీటును కేటాయించారు.