గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (19:17 IST)

జగన్‌కు షాకిచ్చిన సీబీఐ కోర్టు.. వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్​ కొట్టివేత

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పిటిషన్‌ను హైదరాబాద్​లోని నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది.

గత నెల 18న సీబీఐ న్యాయస్థానంలో ఇరువైపుల వాదనలు ముగిశాయి. ప్రతీ శుక్రవారం విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లి కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందని, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలో కేటాయించాల్సి ఉందన్నారు. కాగా జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇప్పటికే కేసుల విచారణను జాప్యం చేస్తున్నారని, వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే.. మరింత ఆలస్యం జరుగుతుందని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానులేనని, సీఎం అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ వాదించింది.

గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసినందున సీబీఐ కోర్టుకు విచారణ జరిపే పరిధి లేదని పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు.. ఇవాళ జగన్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.