బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 22 మే 2021 (23:33 IST)

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి.
 
ముఖ్యమంత్రి లేఖలోని ప్రధాన అంశాలు.
 
– కోవిడ్‌–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు. 
– రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించాము. 
– అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌ల టీకాలు పూర్తి చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాము.
– మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్‌ వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోంది.
– వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్‌ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసలుబాటు ఉండడంతో, కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి.
– ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, వారి విమర్శలకు దారి తీస్తోంది. నిజానికి కోవిడ్‌ వాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందించాల్సి ఉంది. అలా వీలు కాకపోతే నామమాత్ర ధరలో టీకా వేయాలి.
– 45 ఏళ్లు దాటిన వారికే రెండు డోస్‌ల వాక్సిన్‌ వేయడానికి సరిపడా సరఫరా ఇప్పుడు లేదు. 
– ఇలాంటి పరిస్థితుల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం వచ్చే కొన్ని నెలల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
– ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్‌ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదు. వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారం ధరలకు టీకాలు వేసే అవకాశం ఉంది.
– ఇది పేద ప్రజలను వాక్సిన్‌కు దూరం చేయడమే కాకుండా, డిమాండ్‌ పెరగడంతో వాక్సిన్ల బ్లాక్‌ మార్కెట్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది.
– ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్‌ వేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం అన్నది మంచి ఆలోచనే అయినా, అవసరానికి మించి వాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పుడే అది సబబు అవుతుంది.
– వాక్సిన్‌ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాక్సిన్‌ వేయించుకుంటారు. 
– కానీ డిమాండ్‌ కంటే చాలా తక్కువగా ఇప్పుడు వాక్సిన్‌ ఉత్పత్తి అవుతోంది.
– ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వాక్సిన్‌ కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం ఛార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడింది.
– కాబట్టి, ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాను. 
– దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్‌ డోస్‌లు వేసే వీలు కలుగుతుంది.
– ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను అని సీఎం శ్రీ వైయస్‌ జగన్, ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి లేఖ రాశారు.