1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (09:34 IST)

ఏ మొహం పెట్టుకుని కేంద్రాన్ని జోక్యం చేసుకోవాలని అడుగుతావు: బీజేపీ నేత జివిఎల్

ఏపీ బీజేపీ నేతలు ఓవైపు టీడీపీ ఆఫీస్ లపై జరిగిన దాడుల్ని ఖండిస్తూనే మరోవైపు చంద్రబాబు పై విమర్శలు కురిపించారు. ఏ మొహం పెట్టుకుని కేంద్రాన్ని  జోక్యం చేసుకోవాలని అడుగుతావు అని ప్రశ్నించారు. ఒకరిద్దరు నేతలు టైమ్ చూసుకుని కాస్త గట్టిగానే బాబుని తగులుకున్నారు. 
 
ఎంపీ జీవీఎల్ పూర్తిగా బాబు నోరు మూయించినంత పని చేశారు. గతంలో బాబు చేసిన కుట్రలన్నిటినీ బయటపెట్టారు. ఒకరకంగా వైసీపీ కంటే ఎక్కువగా జీవీఎల్ ఈ విషయంలో రియాక్ట్ అయ్యారు, బాబుని ఇరుకున పెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో లాభపడిన చంద్రబాబు.. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పి చివర్లో ప్రత్యేక హోదా అంటూ ఎలా డ్రామాలు ఆడారో అందరికీ తెలిసిందే.

ఆ క్రమంలో కేంద్రంతో చంద్రబాబు యుద్ధాన్ని ప్రకటించారు. కేంద్ర మంత్రులెవరూ ఏపీలో అడుగు పెట్టకూడదని హుకుం జారీ చేశారు. తిరుపతిలో అమిత్ షా పై రాళ్లు వేయించారు. ప్రధాని మోదీని బండబూతులు తిట్టారు, తిట్టించారు. మోదీ పర్యటనకు వస్తే నల్ల గుడ్డలతో నిరసన చేపట్టారు.

కేంద్రాన్ని అంతలా ద్వేషించి, అసలు కేంద్ర ప్రభుత్వమే వేస్ట్ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కేంద్రాన్ని దేహీ అని వేడుకోవడం హాస్యాస్పదం అని అన్నారు జీవీఎల్.

సీబీఐకి ఎంట్రీ లేదని రెచ్చిపోయిన బాబు.. ఇప్పుడు ఏపీ పోలీసులు వేస్ట్.. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారని ప్రశ్నించారు. మోదీ బ్యానర్లు చించివేయించి, మసిపూసి నిరసన చేపట్టిన బాబు, ఏ మొహంతో అదే మోదీకి లేఖ రాశారని అడిగారు.

అప్పుడు కేంద్రంతో బాబుకి పనిలేదని, ఇప్పుడు ఏపీలో పార్టీ పరిస్థితి బాగోలేదు కాబట్టి కాళ్లబేరానికి వస్తున్నాడని, చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. గతంలో ఏపీలో జరిగిన పరిణామాలను టీడీపీ మరచిపోయినా, బీజేపీ మరచిపోలేదన్నారు జీవీఎల్. మోదీకి లేఖ రాసి శరణు కోరే ముందు.. ఆయనకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.