శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (12:45 IST)

షటిల్ ఆడుతూ క్షణాల్లో కుప్పకూలిన సీఐ.. ఊపిరి తీసుకునేలోపే..?

Shuttle
షటిల్ ఆడుతూ సీఐ క్షణాల్లో కుప్పకూలిపోయాడు. పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. రోజులానే షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందారు. సీఐ మృతితో సహచర సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.
 
గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్‌ (48) మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షటిల్‌ ఆడుతూ కుప్ప కూలిపోయారు. సర్వీస్‌ చేసిన వెంటనే ఆయాసం రావడంతో.. ఊపిరి తీసుకునేలోపే.. నేలపై పడిపోయారు. అప్పటివరకు ఆడుతున్న వారు ఏం జరిగిందో తెలుసుకునేలోగా.. అప్పటికే ఆయన ఊపిరి ఆగిపోయింది. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా కరప వద్ద సజ్జాపురపుపాడుకు చెందిన భగవాన్‌ ప్రసాద్‌ 2003లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని తపించేవారు. ఈ క్రమంలో 2007లో రిజర్వుడు ఎస్‌ఐగా ఎంపికై జిల్లాలోని గణపవరం, తాడే పల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2018లో సీఐగా పదోన్నతి పొంది కుక్కునూరులో పనిచేశారు.
 
2019 నుంచి రెండేళ్లుగా గణపవరంలో సీఐగా ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్‌ చూపించేవారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల కష్టాలను ఎంతో ఓపిగ్గా విని.. వారి సమస్యలను పరిష్కరించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు.