1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (06:30 IST)

ఏపీ 'దిశ ఎఫెక్ట్‌'.. 7 నిమిషాల్లో అరెస్ట్‌

ఏపీలో దిశ సూపర్ ఎఫెక్ట్ చూపుతోంది. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ ద్వారా తొలి కేసు నమోదైంది.

ఆర్టీసీ బస్సులో విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న మహిళ ఈ యాప్‌ను వినియోగించడంతో పోలీసులు ఆరు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకొని, ఆమెను వేధించిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ యాప్‌ ద్వారా మొట్టమొదటి ఫిర్యాదు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నమోదైంది.

విజయవాడకు చెందిన ఓ ఉన్నతాధికారిణి ఆర్టీసీ గరుడ బస్సులో సోమవారం రాత్రి విశాఖపట్టణం నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కేలోతు బసవయ్య(43) ఆమె వెనుక సీటులో కూర్చున్నారు.

అర్ధరాత్రి దాటిన తరువాత బస్సులో అందరూ నిద్రపోతుండగా, బసవయ్య ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఎన్నిసార్లు విసుక్కున్నా, మరింత శృతిమించాడు.

ఆమె ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉండడంతో మంగళవారం తెల్లవారుజామున 4.21 గంటలకు ఆ యాప్‌లో బటన్‌ నొక్కారు. అప్పటికి ఆ బస్సు ఏలూరు మెయిన్‌ బైపా్‌సలో వెళుతోంది.

యాప్‌ నుంచి మంగళగిరిలోని కాల్‌సెంటర్‌కు సమాచారం చేరడంతో.. ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. దీంతో ఏలూరు డీఎస్పీ కిరణ్‌ ఆధ్వర్యంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలు ఆరు నిమిషాల్లోనే(4.27 గంటలకు) కలపర్రు టోల్‌గేటు వద్దకు చేరుకున్నాయి.

బసవయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 354, 354ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ చెప్పారు.