1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (08:43 IST)

కడప సెంట్రల్ జైలులో కరోనా విజృంభణ : వైరస్ బారినపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా రక్కసి పట్టిపీడిస్తోంది. ఈ రాష్ట్రంలో వైరస్ బారినపడిన వారి సంఖ్య ఇప్పటికే మూడు లక్షలు దాటిపోయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంది. అలాగే, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే జైలు ఖైదీలకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా కడప కేంద్ర కారాగారంలో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. ఈ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు, రిమాండ్ ఖైదీలలో చాలా మందికి వైరస్ సోకింది. జైలులోని ఖైదీలు, సిబ్బంది సహా మొత్తం 700 మంది నమూనాలను పరీక్షించగా, 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బంది, అధికారులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది.
 
ఈ కరోనా వైరస్ సోకినవారిలో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత, ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. వైరస్ పాజిటివ్ వచ్చిన వారందరినీ వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని, వారికి చికిత్సను అందిస్తున్నామని జైలు సూపరింటెండెంట్ నాయక్ వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిందని తెలియడంతో తాడిపత్రి, అనంతపురం ప్రాంతంలో పోలీసు బందోబస్తును పెంచారు. 
 
ఏపీలో 3 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రక్కసి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. గడచిన 24 గంటల్లో మరో 9652 మందికి ఈ వైరస్ సోకింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 కేసలు నమోదయ్యాయి. వీటన్నింటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది. 
 
ఇకపోతే, మరణాల సంఖ్య ఆందోళనకరరీతిలోనే ఉంది. తాజాగా 88 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. మొత్తమ్మీద రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,820కి పెరిగింది. గత 24 గంటల్లో 9,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపురంలో 5051, చిత్తూరులో 9366, ఈస్ట్ గోదావరిలో 15254, గుంటూరులో 7920, కడపలో 4456, కృష్ణలో 2863, కర్నూలులో 6872, నెల్లూరులో 5201, ప్రకాశంలో 4840, శ్రీకాకుళంలో 5220, విశాఖపట్టణంలో 5797, విజయనగరంలో 6931, వెస్ట్ గోదావరిలో 5359 కేసుల చొప్పున యాక్టివ్‌లో ఉన్నాయి. 
 
అలాగే, ఈ జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి చనిపోయిన మృతుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురంలో 238, చిత్తూరులో 257, ఈస్ట్ గోదావరిలో 290, గుంటూరులో 306, కడపలో 125, కృష్ణలో 232, కర్నూలులో 306, నెల్లూరులో 155, ప్రకాశంలో 185, శ్రీకాకుళంలో 175, విశాఖపట్టణంలో 216, విజయనగరంలో 126, వెస్ట్ గోదావరిలో 208 చొప్పున ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2820 మంది చనిపోయారు.