1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (05:39 IST)

కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు: బాబుకు జేసీ సలహా

జగన్‌ ప్రభుత్వం తప్పటడుగులను చంద్రబాబు ఎత్తిచూపడం టీడీపీలోని కొంతమంది నేతలకు ఏమాత్రం ఇష్టంలేదు. అనంతపురం మాజీ ఎంపీ, రాజకీయాల్లో సీనియర్ అయిన జేసీ దివాకర్‌రెడ్డి అయితే ఈ అంశాన్ని చంద్రబాబు ముందే నిర్మొహమాటంగా చెప్పేశారు.

శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి జేసీ విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో అరగంటసేపు సమావేశమయ్యారు. "తప్పులు ఎక్కువ చేయనివ్వండి. మీరెందుకు తొందరపడి చెబుతున్నారు? ఎన్ని తప్పులు చేస్తే అన్నీ చేయనివ్వండి. ఓటేసిన ప్రజలక్కూడా నొప్పి తెలియాలి కదా?'' అని జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

అంతేకాదు- "గ్రామాల్లో పరిస్థితి మీకర్థం కావడంలేదు. వైసీపీ వర్గాలు మీదమీదకి వస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాలు కొనగుతున్నాయి. ప్యాక్షన్ ఉండే గ్రామాల్లో తెలుగుదేశం వర్గాలు ఉండలేకపోతున్నాయి. జగన్ ఎన్ని తప్పులు చేస్తే అంతా మనకి మంచిదే. ఒకసారి గెలిపిస్తే ఏమవుతుందనుకున్న జనానికి ఇప్పటికే తలబొప్పి కట్టింది. పూర్తిగా అందరికీ సినిమా అర్థంకావాలి. అప్పటివరకు మీరు వెయిట్ చేయండి..'' అంటూ చంద్రబాబుకు జేసీ దివాకర్‌రెడ్డి హితబోధ చేశారు. 
 
"మనకు 23 సీట్లిచ్చారు. వాళ్లకు 151 సీట్లిచ్చారు. బాధ్యత వాళ్ల మీదే ఉంది. సక్రమంగా పరిపాలించాల్సింది వైసీపీ వాళ్లే. రాష్ట్ర ప్రజలు ఒకసారి చూద్దాం అనుకున్నారు.. మనం కూడా ఒకసారి చూద్దాం..'' అని నవ్వుతూ చెప్పారు.

"ఆంధ్రప్రదేశ్‌ను 14 ఏళ్లు పరిపాలించిన ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన నేను రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చెప్పకుండా ఉండలేను కదా? అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిపోతోంది. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని అనుకున్నవాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారు'' అని చంద్రబాబు జేసీ వద్ద వ్యాఖ్యానించారు.