గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:31 IST)

అక్కడ మాత్రం వైసీపీ అభ్యర్థి గెలుస్తారు: కేఏ పాల్

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఏపీలో 76.69 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ముందు మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా తానే కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

 

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. తన వినూత్న ప్రచారంతో పలువురిని ఆకట్టుకున్నారు.
 
ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కేఏ పాల్ అభ్యర్థించారు. నిన్నటివరకు నరసాపురంలో ప్రజాశాంతి పార్టీదే గెలుపు అంటూ వచ్చిన పాల్ తాజాగా ప్లేట్ మార్చేశారు. నరసాపురంలో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతున్నారు. 
 
నరసాపురం లోక్‌సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ ఈవీఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని కేఏ పాల్ జోస్యం చెప్పారు. కాగా ఎన్నికల కమిషన్ భారత ప్రధాని నరేంద్రమోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. అవినీతిపై యుద్ధానికి పెద్ద ఎత్తున యువత తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.