గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జులై 2019 (17:52 IST)

జనసేన నేతకు షాక్: బీజేపీలో చేరిన మాజీ సీఎం నాదెండ్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఎట్టకేలకు బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా బీజేపీలో చేరే అంశంపై ఆలోచిస్తున్న ఆయన శనివారం బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో పార్టీ  కండువా కప్పుకున్నారు. 
 
కేఎల్ సీసీ కన్వెన్షన్ సెంటర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా నాదెండ్ల భాస్కరరావును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువాకప్పారు. 
 
ఇకపోతే ఏపీలో బీజేపీ బలోపేతం కావాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు గాలం వేసింది. 
 
చాలా కాలంగా నాదెండ్ల భాస్కరరావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వపన్ కళ్యాణ్ తరువాత స్థానం నాదెండ్ల మనోహర్ దే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.  
 
ఇలాంటి తరుణంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పార్టీని ఘోరంగా దెబ్బతీసిన బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. 

ఇప్పటికే జనసేన పార్టీ నుంచి రావెల కిషోర్ బాబులతోపాటు పలువురిని తమ పార్టీలో చేర్చుకుంది బీజేపి. తాజాగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తండ్రిని బీజేపీ ఆహ్వానించింది. నాదెండ్ల భాస్కరరావును పార్టీలో చేర్చుకోవడం ద్వారా జనసేన పార్టీపై ఎంతోకొంత ప్రభావం చూపుతుందని బీజేపీ భావిస్తోంది. 
 
అంతేకాదు త్వరలో నాదెండ్ల మనోహర్ ను కూడా బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు కూడా బీజేపీ చేస్తుందని ప్రచారం. ఇకపోతే నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్ టన్ డీసీలో ఉన్నారు. తానా మహాసభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పాల్గొన్నారు.