గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (09:30 IST)

మాయమైపోయిన ఏపీసీఆర్డీయే మళ్లీ ప్రత్యక్షమైంది... ఎలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీంతో కోర్టులో మొటిక్కాయలు తప్పడం లేదు. తాజాగా పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావించింది. అలాగే, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల హక్కులను కాపాడేందుకు వీలుగా సీఆర్డీయే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ ఆమోదముద్రవేశారు. ఇదే అదునుగా భావించిన ఏపీ సర్కారు అమరావతిలోని కార్య నిర్వాహక ప్రధాన కార్యాలయన్నీ విశాఖపట్టణానికి తరలించేందుకు పూనుకుంది. అంతేకాకుండా, సీఆర్డీఏ చట్టం రద్దుపై గవర్నర్ ఆమోదముద్రవేయగానే, సీఆర్డీఏ వెబ్‌సైట్ కూడా మాయమైపోయింది. 
 
ఈ నేపథ్యంలో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు.. స్టేటస్ కో (యధాతథ స్థితి) విధించింది. దీంతో మాయమైపోయిన 'ఏపీసీఆర్డీయే' మళ్లీ ప్రత్యక్షమైంది. 
 
ఏపీసీఆర్డీయే రద్దు బిల్లును గవర్నర్‌ ఆమోదించగానే... దాని ఆనవాళ్లు సమూలంగా తొలగించేందుకు ఉన్నతాధికారులు హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంపై ఉన్న బోర్డులను తొలగించారు. 
 
ప్రభుత్వ వాహనాలపై ఉన్న సీఆర్డీయే స్టిక్కర్లను తీసేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రోపాలిటన్‌ రీజన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఏఎంఆర్డీయే) స్టిక్కర్లు పెట్టేశారు. ఏపీసీఆర్డీయే వెబ్‌సైట్‌ను కూడా ఏఎంఆర్డీయేగా మార్చేశారు. 
 
అయితే... మూడు రాజధానులు, ఏపీసీఆర్డీయే చట్టం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్పందిస్తూ... ఈనెల 14 వరకు 'యథాతథస్థితి' కొనసాగించాలని ఆదేశించింది. దీంతో.. అధికారులు మళ్లీ వెబ్‌సైట్‌ను ఏపీసీఆర్డీయేగా మార్చేశారు. 
 
నిజానికి... హైకోర్టు కార్యాలయాల తరలింపుపై 'స్టేటస్ కో' విధించింది. ఎక్కడి కార్యాలయాలు అక్కడే ఉండాలన్నది కోర్టు ఆదేశం. కానీ... అధికారులు వెబ్‌సైట్‌ పేరును కూడా 'పూర్వస్థితి'కి తీసుకురావడం గమనార్హం.