వైకాపా నేత, ఏయూ మాజీ వీసీ ప్రసాద రెడ్డికి జైలుశిక్ష
ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉంటూ ఆ వర్శిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన ప్రసాద రెడ్డికి ఏపీ హైకోర్టు నెల రోజుల పాటు జైలుశిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఈ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల పట్ల ప్రసాద రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారని, మొండి వైఖరిని అవలంభించారని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రా వర్శిటీలో బోటనీ విభాగంలో 17 యేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న నూకన్న దొరను 2022లో వీసీ విధుల నుంచి తొలగించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గత 2023 మార్చిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ సమయంలో వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి (పక్కా వైకాపా నేత) కోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. దీంతో నూకన్న దొర మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు... ప్రసాదరెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే నిర్ధారణకు వచ్చారు. వీసీగా పదవి నుంచి దిగిపోయేవరకు ఆయన ఆ ఆదేశాలను అమలు చేయలేదని, కొత్త వీసీ వచ్చాకే అవి అమలయ్యాయని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కనికరం చూపిస్తే న్యాయవ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని న్యాయాధికారి ఘాటుగా వ్యాఖ్యానించారు.
అయితే, ప్రసాద రెడ్డి అభ్యర్థన మేరకు అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ లోగా అప్పీల్లో స్టే రాకపోతే డిసెంబరు 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.