గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (20:23 IST)

ద్యావుడా.. అధినేత వద్దన్నా జగన్‌ని కలిసిన జనసేన ఎమ్మెల్యే, ఎందుకు?

జనసేన పార్టీకి ఉన్నదే ఒకే ఒక్క ఎమ్మెల్యే. మొత్తం 175 స్థానాల్లో జనసేన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రం ఉండటం ఎపి రాజకీయాల్లో ఎప్పటికీ హాట్ టాపిక్‌కే. ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పక్క చూపులు చూస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. అధికార పార్టీ వైపే ఎక్కువగా దృష్టి పెట్టారు జనసేన ఎమ్మెల్యే.
 
ఏకంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం.. మూడు రాజధానులను సమర్థించడం.. స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటెయ్యమని చెప్పినా పట్టించుకోకపోవడం.. ఇదంతా ఇప్పుడు జనసేన పార్టీలోనే కాదు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
అంతేకాదు ఈరోజు ఏకంగా ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చున్నారు రాపాక వరప్రసాద్. అంతేకాదు ఆయనతో కాసేపు మాట్లాడారు కూడా. సర్.. రాజధానిపై మీ నిర్ణయం బాగుందంటూ చెబుతూ ఆయన వైపు చూస్తూ నవ్వారు రాపాక. అలాగే మరికొన్ని విషయాలను చర్చించారు. ఇది కాస్త జనసేన పార్టీ నేతలకు కోపం తెప్పిస్తోంది.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలిస్తే పట్టించుకోకుండా అసెంబ్లీలో నేరుగా సిఎం పక్కన వెళ్ళి రాపాక కూర్చోవడం ఏమిటో ఆ పార్టీ నేతలకే అర్థం కాలేదు. అసలు అసెంబ్లీలో సిఎం పక్కన రాపాక కూర్చున్నప్పుడు వైసిపి ఎమ్మెల్యేలందరూ రాపాకను ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. సుమారు ఐదు నిమిషాలకు పైగా సిఎం పక్కన కూర్చుండిపోయారు రాపాక. ఆ తరువాత యధావిధిగా తన స్థానంలోకి వెళ్ళిపోయారు.