శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (19:40 IST)

రెండో రోజూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలు

గురువారం రెండో రోజూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలు జరిగాయి. ఆన్‌లైన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకుని భక్తులు దర్శనానికి వస్తున్నారు.

క్యూలైన్లలో భక్తులు భౌతిక​ దూరం పాటించేలా ఆరు అడుగుల మార్కింగ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. 
 
ఉదయం ఆరు గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనం కొనసాగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంద్రకీల్రాదీపై అధికారులు పకడ్బందీ జాగ్రత్త చర్యలు చేపట్టారు.

దర్శనానికి గంటకు 250 మంది భక్తులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. శానిటైజ్‌ చేసి చేతులు శుభ్రం చేసుకుని, మాస్క్‌ ధరిస్తేనే భక్తులకు అనుమతిస్తున్నారు.

థర్మల్‌ స్క్రీనింగ్‌ లో టెంపరేచర్ ఎక్కువ వస్తే అనుమతులు ఇవ్వడం లేదు. శఠగోపురం, తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు రద్దు చేశారు. అంతరాలయ దర్శనం నిలిపివేశారు.

ముఖ మండపం ద్వారానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. మహా మండపం వద్ద మరో ఆన్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా అన్ని అర్జిత సేవలకు అనుమతి ఇవ్వడం లేదు.

ఘాట్ రోడ్డు మార్గం ద్వారా భక్తులకు అనుమతిలేదని, వృద్ధులు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు.