1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Telangana Budget Sessions Starts Today

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే...

Telangana
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 2022-23 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ ఆమోదం కోసం శాసనసభ, శాసనమండలి సమావేశం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఉభయ సభలు ప్రోరోగ్ కానందున గత అక్టోబరులో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే ఇపుడు అసెంబ్లీని గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే, దీనిపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, ఇందుకోసం శాసనసభ, శాసన మండలి ఉదయం 11.30 గంటలకు సమావేశమవుతాయి. ఈ సమావేశాలు పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక శాఖామంత్రిగా టి.హరీష్ రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభలను వాయిదావేస్తారు. ఆ తర్వాత బీఏసీలో సమావేశాల అజెండాను ఖరారు చేస్తారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో 2022-23 సంవత్సరానికిగాను రూపొందించిన బడ్జెట్‌కు ఆమోదించారు. 
 
ఆ తర్వాత సోమవారం ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెడతారు. అయితే, ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై శాసనసభా వ్యవహారాల కమిటి (బీఏసీ)లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 
 
అయితే, ఈ దఫా బడ్జెట్ సమావేశాలు తొలి రోజున గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభంకానున్నాయి. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. దీనిపై గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
'యోగి'తో రహస్య సమాచారం షేర్ చేసిన చిత్రా రామకృష్ణన్.. అరెస్టు