శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (15:36 IST)

పరాకాష్టకు చేరిన వైకాపా ప్రచార పిచ్చి.. కోడిగుడ్డునూ వదల్లేదు!!

egg - anganwadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి ప్రచార పిచ్చి బాగానే ముదిరిపోయినట్టుంది. ఈ పిచ్చి పరాకాష్టకు చేరుకోవడంతో ఇష్టానురీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా పార్టీ రంగులు వేసుకున్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టు మొట్టికాయలు వేసుకున్నాకగానీ వైకాపా నేతలకు బుద్ధిరాలేదు. ఆ తర్వాత సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మ పడింది. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలపైనా ఆయన చిత్రమే. ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లను సైతం వదిలిపెట్టలేదు. 
 
పిల్లలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఇచ్చే గుడ్లపై వైఎస్సార్ ఎస్సీ అని, జగనన్న గోరుముద్ద కింద అందించే గుడ్లపై జేజీఎమ్ అని ముద్ర వేసి పంపిణీ చేస్తున్నారు. తండ్రీకొడుకుల పేర్లు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతినెలా వైఎస్సార్ పోషణ, పోషణ ప్లస్ పథకాలను చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు సుమారు 22.76 లక్షల వరకు అంగన్‌వాడీలు కేంద్రంగా అందుకుంటున్నారు. 
 
ఇందులో మూడొంతులు మంది చిన్నారులే. వైఎస్సార్ పోషణ కింద ప్రతినెలా ఆంగన్‌వాడీల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు 25 చొప్పున, గిరిజన ప్రాంతాల్లో అయితే వీరికి 30 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు జగన్ చూపు గుడ్డుపై పడింది. సంపూర్ణ పోషణ పథకాన్ని షార్ట్ కట్ చేసి 'వైఎస్సార్ ఎస్సీ' అంటూ కోడిగుడ్లపై ముద్రించి మరీ పంపిణీ చేస్తున్నారు. కోడిగుడ్లు నెలకు మూడు సార్లు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. 
 
ప్రతినెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు కోడిగుడ్లపై పింక్ కలర్, 11 నుంచి 20వ తేదీ వరకు సరఫరా చేసే గుడ్లపై బ్లూ కలర్, 21 నుంచి నెల చివరి వరకు గ్రీన్ కలర్ వేసిన కోడి గుడ్లను పంపిణీ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు కోడిగుడ్లపై కలర్లు ముద్రిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు వీటికి ఎన్నికల రంగును జగన్ సర్కారు జోడించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైఎస్సార్ ఎస్సీ లోగో ముద్రించిన కోడిగుడ్లు అంగన్వాడీలకు సరఫరా అవ్వ తుండగా, మరి కొన్ని జిల్లాల్లో ఆగస్టు నుంచి ఎస్సార్ ఎస్పీ లోగోను ముద్రించిన కోడిగుడ్లనే సరఫరా చేయనున్నట్లు తెలిసింది.