1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP leader Kodali Nani makes objectionable comments on SEC Nimmagadda Ramesh Kumar

నోటికి తాళం వేయని మంత్రి కొడాలి... గవర్నర్‌కు నిమ్మగడ్డ మరో లేఖ!

Kodali Nani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని నోటికి తాళం పడటం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కుక్కతో పోల్చారు. ఆయనో కులపిచ్చి నేత అంటూ దూషించారు. అలాంటి వ్యక్తిని తక్షణం ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 
 
దీంతో ఆగ్రహం చెందిన కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నరు హరిచందన్‌కు మరో లేఖ రాశారు. తనను దూషించిన మంత్రి కొడాలి నానిపై  కఠిన చర్య తీసుకోవాలని గట్టిగా కోరారు. దీనిపై గురువారం గవర్నర్‌ విశ్వభూషణ్‌కు లేఖ రాశారు. 
 
బుధవారం తనను ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వీడియో టేప్‌ను, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను జత చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించి పంపించారు. 
 
'మంత్రి కొడాలి నాని ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థ తన విధులు నిర్వహించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోండి' అంటూ కోరారు. 
 
ప్రభుత్వ ప్రోద్బలంతోనే మంత్రులు ఇలా మాట్లాడుతున్నారని నిమ్మగడ్డ పేర్కొనడం గమనార్హం. 'ఎస్‌ఈసీకి ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం. మీ ద్వారానే అది జరుగుతుంది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మరోమారు కోరుతున్నాను' అని లేఖలో పేర్కొన్నారు. 
 
అలాగే, గురువారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారో లేక చంద్రబాబు చేతిలో ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నారు. దొంగలను తీసుకొచ్చి రాజ్యాంగ పదవిలో చంద్రబాబు కూర్చోబెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
గతంలో ఎవరిని అడిగి స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ ఆపారని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో మాట్లాడి ఎన్నికలను నిర్వహిస్తారా? అని మండిపడ్డారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
జార్జియాలో రీకౌంటింగ్‌లోనూ ఓడిన డోనాల్డ్ ట్రంప్... మిచిగన్‌లో వెనుకడుగు..