సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి.. పుట్టినరోజుకు ఒక్క రోజు ముందే?
సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణ, పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన మొగిలి మధుకర్ మల్లాపూర్ గురుకుల హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు.
భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హాస్టల్ లోని సిబ్బంది కోసం కేటాయించిన క్వార్టర్స్లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం హాస్టల్లో విద్యార్థుల కోసం సాంబారు సిద్ధం చేసి.. మిగతా వంటకాలు సిద్ధం చేస్తుండగా.. అక్కడే ఆడుకుంటున్న మధుకర్ కొడుకు మోక్షిత్ (4).. ప్రమాదవశాత్తూ సాంబారు పాత్రలో పడిపోయాడు.
సాంబార్ వేడిగా ఉండడంతో మోక్షిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మోక్షిత్ను కరీంనగర్ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. సోమవారం మోక్షిత్ బర్త్ డే కావడంతో ఆదివారం సాయంత్రం ధర్మారం వెళ్లాలని మధుకర్ భావించాడు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.