గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (19:12 IST)

హైదరాబాద్ నగరంలో కరోనా డేంజర్ జోన్లు ఇవే...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా డేంజర్ జోన్లను అధికారులు గుర్తించారు. మొత్తం 8 జోన్లలో ఈ వైరస్ చాలా తీవ్రంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. మరోవైపు, కరోనా వైరస్ సోకిన పాజిటివ్ రోగులు ప్రజల మధ్య తిరుగుతూ ప్రతి ఒక్కరినీ షాక‌కు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని ట్రేజ్ చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. అందుకే ప్రజల మధ్య తిరిగే కరోనా పాజిటివ్ రోగుల విషయంలో అధికారులు చేతులెత్తేశారు.
 
అలాగే టెస్టింగ్ సమయంలో రాంగ్ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇస్తూ అధికారులకు తలనొప్పిగా మారుతున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు నాలుగైదు రోజులు ఆలస్యంగా రావడం ఇబ్బందులకు గురిచేస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో సొంత వైద్యం చేసుకుంటూ... ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని బయట తిరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3 వేల మంది కరోనా రోగులు కాంటాక్ట్‌లోకి లేరని అధికారులు చెబుతున్నారు. 
 
తప్పుడు చిరునామాలతో ప్రభుత్వాన్ని బాధితులు మోసం చేస్తున్నారు. కరోనా సోకిందని చెబితే ఎక్కడ అపార్టుమెంట్‌ల్లోకి రానివ్వరని బాధితులు భయపడుతున్నారు. టేక్‌అవేలు, గ్రాసరీస్, మెడికల్ షాపులకు కూడా పాజిటివ్ వ్యక్తులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వైద్య అధికారులకు కూడా కరోనా బాధితులు కాంటాక్ట్‌లోకి రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మరోవైపు జీహెచ్‌ఎంసీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. దాదాపు 28 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కమ్యూనిటి ట్రాన్స్ మిషన్ స్టేజ్‌లో ఉన్నామని...జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ప్రమాదకరంగా మారిన ఎనిమిది సర్కిళ్ళను అధికారులు గుర్తించి, హెచ్చరికలు చేస్తున్నారు. యూసుఫ్ గూడా, అంబర్ పేట్, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్, మెహదీపట్నం, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ ప్రాంతాలను డేంజర్ సర్కిళ్లుగా ప్రకటించారు.