శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (10:01 IST)

సైబర్ నేరాలకు అడ్డాగా హైదరాబాద్ నగరం..

cyber attack
రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. కొత్త కొత్త స్కీములను తెరపైకి తెచ్చి అమాయక ప్రజలను అడ్డంగా దోచేస్తున్నారు. మాయమాటలతో బురిడీ కొట్టించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఒకే విధమైన నేరాన్ని అనేక కోణాల్లో చేస్తూ అమాయకుల ఖాతాలను అడ్డంగా దోచేస్తున్నారు. 
 
సైబర్ నేరాలకు సంబంధించి గ్రేటర్‌లోని ట్రై పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో రోజుకు 40-50 ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక్కో బాధితుడు రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు పోగొట్టుకుంటున్న సందర్భాలున్నాయి. రోజుకు సుమారుగా రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. 
 
ఇతర నేరాలతో పోలిస్తే వీటిని చేదిం చడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. వివిధ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో తిష్టవేసిన కేటుగాళ్లు ఆన్‌లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు. ఒక పోలీస్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి 15-30 రోజులపాటు మకాం వేసి నిందితులను పట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అసలైన నిందితులు దొరకకుండా పరారీలో ఉంటున్నారు. వారిని పట్టుకోవడానికి మరికొన్ని నెలలు పడుతుంది. 
 
ఇలా ఒక్క కేసులో రోజుల తరబడి పోలీసులు దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈలోగా వందల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిలో కేవలం 5 శాతం కేసులను కూడా ఛేదించలేని పరిస్థితి నెలకొందని సైబర్ క్రైమ్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సైబర్ నేరాలను ఎలా కట్టడి చేయాలో అర్థం కాక సైబర్ క్రైమ్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.