1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. IMD sounds red alert for Telangana, forecasts heavy rain for next three days.

వచ్చే మూడు రోజులు తెలంగాణాలో భారీ వర్షాలు

rain
వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు ప్రాంతాల్లో ఆరెంజ్ నుంచి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మంగళవారం నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.
 
ముఖ్యంగా, మంగళవారం నాడు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
హైదరాబాద్ నగరంలో దంచికొట్టిన వర్షం.. 
 
హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విస్తారంగా వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా, సాయంత్రం 5.30 గంటలకు కుండపోత వర్షం కురిసింది. ఆరు గంటల సమయానికి మియాపూర్‌లో 3.65 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదేసమయానికి సెంటీమీటరు వర్షపాతం నమోదైన చార్మినార్, సరూర్ నగర్ ప్రాంతాల్లో.. రాత్రి 7 గంటలకు వరుసగా 4.78, 4.4 సెం.మీ. కురిసింది. 
 
నగరంలోని నాలాల సామర్థ్యం కన్నా రెట్టింపు వర్షపాతం నమోదైంది. వరద నాలాలకు గంటకు 2 సెం.మీ. వర్షాన్ని తట్టుకునే శక్తి మాత్రమే ఉంది. అంతకుమించి కురవడంతో నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి. మలక్‌పేట మార్కెట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రధాన రహదారిపై మోకాల్లోతు నీరు ప్రవహించింది. మూసీపై ఉన్న అత్తాపూర్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై నీరు నిలవడంతో వాహనాలను ట్రాఫిక్ పోలీసులు గోల్నాక మీదుగా మళ్లించారు. 
 
ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, హైటెక్ సిటీలో పెద్ద సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 11.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సంగెంలో 9.0, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 8.4, దండుమైలారం (రంగారెడ్డి జిల్లా)లో 7.7 సెం.మీ., హైదరాబాద్ నగరంలోని శివరాంపల్లిలో 6.48, చార్మినార్ లో 6.33 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 
 
అంతకుముందు ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 10 నుంచి 16 సెం.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా వెల్గనూరులో 16.1, పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్లో 15.2 సెం.మీ. నమోదైంది. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
భారత మహిళ అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు : పాక్ యువకుడు