శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (20:51 IST)

బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు: కేసీఆర్ ఫైర్

‘‘దుబ్బాక‌లో ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయ‌కులు ఘోరాతి ఘోర‌మైన అబ‌ద్దాలు మాట్లాడుతున్నారు" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు

బీజేపీ నాయ‌కుల‌ు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుండడంతో ముఖ్యమంత్రి నేరుగా స్పందించారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్లలో రైతువేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడారు.

పెన్షన్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను ఎండ‌గ‌ట్టారు. బీజేపీ నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని చెబుతున్నారు. ఒకవేళ దాన్ని ఎవ‌డైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను’’ అని సీఎం కేసీఆర్ తీవ్రమైన స‌వాల్ చేశారు.
 
 ‘‘దుబ్బాక‌లో ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయ‌కులు ఘోరాతి ఘోర‌మైన అబ‌ద్దాలు మాట్లాడుతున్నారు. మ‌న రాష్ర్టంలో 38 ల‌క్షల 64 వేల 751 మందికి అన్ని ర‌కాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం కేవ‌లం 7 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే ఇస్తోంది.

మ‌నిషికి 200 మాత్రమే కేంద్రం ఇస్తుంది. సంవ‌త్స‌రానికి క‌లిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లే. రాష్ర్టం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తుంది. బీజేపీ నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌లంద‌రికీ తెలియాలి" అని కేసీఆర్ అన్నారు