శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (15:34 IST)

ఆమె కూడా న్యాయవాది కావడంతో సాక్ష్యం ఉండకూడదని చంపేశాం...

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వామనరావు అనే న్యాయవాద దంపతుల హత్యలో అరెస్టు చేసిన నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. వామనరావు భార్య కూడా న్యాయవాది కావడంతో ఈ కేసులో సాక్ష్యం ఉండకూడదని ఆమెను కూడా చంపేసినట్టు చెప్పారు. 
 
ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులకు గురువారంతో కస్టడీ ముగిసింది. వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్, శివందుల చిరంజీవిలకు నేడు కస్టడీ ముగిసింది. వారిని మంథని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులను 7 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
 
కాగా, రామగుండం అడ్మిన్‌ డీసీపీ అశోక్‌, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ ఆధ్వర్యంలో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. రామగిరి మండలం కల్వచర్ల వద్ద సంఘటన స్థలానికి తీసుకెళ్లి వామన్‌రావు వాహనాన్ని అడ్డగించిన, హత్య చేసిన తీరుపై (సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌) సమగ్రంగా ఆరా తీశారు. మొత్తం విచారణను వీడియోలో రికార్డు చేశారు. 
 
ఇంకా ఈ కేసులో పరోక్షంగా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. వామన్‌రావుతో తమకు వ్యక్తిగతంగా ఉన్న పగ, ప్రతీకారాల కారణంగానే హత్యకు ప్రణాళిక వేశామని, ఆయన భార్య నాగమణి కూడా న్యాయవాది కావడం, ఆమెను కూడా చంపితే ప్రధాన సాక్ష్యం ఉండదనే ఉద్దేశంతోనే ఇద్దరినీ చంపేశామని నిందితులు తెలిపినట్లు సమాచారం.