1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (10:04 IST)

నేడు వాసాలమర్రికి తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామానికి బుధవారం వెళుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ గ్రామం వుంది. వాసాలమర్రిలోని దళితవాడలో ఆయన పర్యటిస్తారు. 
 
అనంతరం రైతువేదికలో 130 మందితో సమావేశంకానున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనకు వాసాలమర్రిలో అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. గత జూన్​ 22న వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్..​ ఆ ఊరి ప్రజలకు దిశానిర్దేశం చేశారు. వారానికి రెండుగంటల పాటు కష్టపడితే బంగారు వాసాలమర్రిని తయారు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. 
 
పరిశుభ్రత, తాగునీరు, వ్యవసాయం ఇలా అన్నింటికీ కమిటీలు ఏర్పడితే.. అభివృద్ధి చెందడం కష్టం కాదని ముఖ్యమంత్రి అన్నారు. జూన్​ 22 మధ్యాహ్నం ఒంటి గంట 18 నిమిషాలకు పల్లెకు చేరుకున్న ఆయన... గ్రామసభ వేదిక పైనుంచి అభివాదం చేసిన అనంతరం గ్రామస్థులందరితో సహపంక్తి భోజనం చేశారు. రెండు గంటల పాటు భోజనశాల వద్దే గడిపారు. 
 
అలాగే ఊర్లోని వాళ్లందరి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆరోగ్య, ఆర్థిక వివరాలు నమోదు చేయాలన్నారు. వాటన్నింటికి పరిష్కారం చూపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని వాసాలమర్రికి బాధ్యురాలిగా నియమిస్తూ కలెక్టర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. 
 
ఆగమ్మ సైతం కేసీఆర్​కు తన కష్టాలు చెప్పుకున్నారు. పెద్దకొడుకులా బాధలు తీరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వాసాలమర్రిని ముఖ్యమంత్రి దత్తత తీసుకోవడం అదృష్టమని స్థానికులు భావిస్తున్నారు. సీఎం చెప్పిన విధంగా నడుచుకొని బంగారు వాసాలమర్రిగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని చెబుతున్నారు.