1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TRS candidate Surabhi Vanidevi returns without files her nomination in Telangana graduate mlc elections

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె.. నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు

TRS
తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆమెకు సీఎం కేసీఆర్ బీ-ఫారం అందించారు. 
 
అయితే నామినేషన్ వేసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వాణీదేవికి నిరాశ ఎదురైంది. నామినేషన్ పత్రాలు సరైన ఫార్మాట్లో లేవని అధికారులు తిరస్కరించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాణీదేవి నిరాశతో వెనుదిరిగారు. దాంతో ఆమె మంగళవారం ఉదయం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.
 
కాగా, పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అధికార తెరాసపై భగ్గుమంటున్నారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. 
 
అలాగే, పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ స్పందించారు. ఎలాంటి గెలుపు అవకాశాలు లేని స్థానంలో తన చిన్నమ్మ వాణీదేవికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఓడిపోతుందని తెలిసీ టికెట్ ఇవ్వడం మోసం చేయడమేనని విమర్శించారు. 
 
ఓ మహనీయుడి పేరు చెప్పుకుని కుటిల రాజకీయాలకు పాల్పడ్డారని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని మోసం చేయడమే కాదని, బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చే ప్రయత్నమని అన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ముంచిన బంధువులు.. టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య