గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (09:25 IST)

కారు.. సారు..అన్నది అందుకేనా?.. విజయశాంతి

ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. యాదగిరి గుట్ట ఆలయంలో స్తంభాలపై దేవతా మూర్తులతోపాటు తన బొమ్మను, కారు గుర్తును, ప్రభుత్వ పథకాలను చెక్కించుకోవడం ఏమిటని నిలదీశారు.

"కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే ముప్పు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పదేపదే సారు... కారు.... సర్కార్ అనే డైలాగ్ ను వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయింది.

ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కెసిఆర్ సార్ బొమ్మను.. కార్ గుర్తును.. టిఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా.. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారు అని అర్థం అవుతోంది.

రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కెసిఆర్ గారు తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం  ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కెసిఆర్ గారు రాజకీయ కోణంలో చూసి.. వాటిని లైట్ గా తీసుకునే ప్రమాదం ఉంది.

తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారు. మరి అలాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ.. ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి  తగ్గట్లు హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టిఆర్ఎస్ పాలకుల కు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నాను" అని విజయశాంతి ఓ ప్రకటనలో విమర్శించారు. యాదాద్రి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటూ దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నారని అన్నారు.