1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (19:08 IST)

హిజాబ్ సెగలు : డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతం చేయొద్దు... కర్నాటక హైకోర్టు

కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్ రచ్చ ఇపుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కర్నాటక రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలుచేసింది. హిజాబ్ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతం చేయొద్దని ఆదేశాలిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది. 
 
అదేసమయంలో సోమవారం నుంచి విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని సూచన చేసింది. విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టకూడదని, తీర్చు వచ్చేంతవరకు తరగతి గదుల్లో విద్యార్థులు హిజాబ్‌లు, కాషాయ కండువాలు ధరించవద్దని సూచించింది. 
 
కాగా, కర్నాటకలోని ఓ ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ దుస్తులు ధరించడాన్ని నిరాకరించారు. దీంతో ఈ హిజాబ్ వివాదం మొదలైంది. దీనిపై 8 మంది ముస్లిం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తర్వాత చాలా కాలేజీలకు వ్యాపించింది. పైగా హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినిలను పక్కన కూర్చోబెట్టారు. దీంతో నిరసనల వేడి మరింతగా పాకింది. 
 
అదేసమయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థలకు చెందిన విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు మెడలా కాషాయ కండువాలు ధరించి కాలేజీలకు రావడంతో ఈ వివాదం దేశ వ్యాప్తంగా పాకింది. దీంతో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు కర్నాటక ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. అదేసమయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది.