శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By కుమార్ దళవాయి
Last Modified: బుధవారం, 13 మార్చి 2019 (19:11 IST)

వాట్సప్‌లో ఎస్‌బీఐ పేరుతో లింక్... ఓటీపి చెప్పారో అంతేసంగతులు...

వాట్సాప్ వినియోగదారులకు ఎస్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో ఎస్‌బీఐ పేరుతో వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవాలంటూ సందేశాలు వస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ హెచ్చరికలు చేసింది. అలాంటి మోసపూరితమైన సందేశాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీ చెప్పాలని కొందరు వినియోగదారులకు ఫోన్‌లు చేయడంతో పాటు అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కూడా అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఎస్‌బీఐ పేర్కొన్నది.
 
మొదట్లో ఖాతా భద్రత గురించి మీకు అవగాహన కల్పిస్తున్నట్లు నటించి వ్యక్తికి నమ్మకం కలిగేలా చేస్తారు. ఆపై ఓటీపీలను చెప్పమని అడుగుతారు. అలాగే సోషల్ మీడియా ద్వారా హానికరమైన లింక్‌లను పంపుతారు. ఆ లింక్‌లను క్లిక్ చేస్తే ప్రమాదకరమైన యాప్‌లు మనకు తెలియకుండానే ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. ఈ యాప్‌లు వినియోగదారులకు తెలియకుండానే ఓటీపీలను దొంగిలిస్తాయి. మరొక విధంగా బ్యాంకు ఉద్యోగులమని కాల్ చేసి కార్డ్ నంబర్, వెనుక ఉన్న సివివి నంబర్ అడుగుతారు. పొరపాటున వాటిని చెప్తే వినియోగదారుల ఖాతాల్లోని సొమ్ము సెకన్లలో మాయమవుతుంది.
 
ఇలాంటి చర్యల వల్ల మోసపోయిన వ్యక్తులు మూడు రోజుల్లోగా బ్యాంకులో సంప్రదించి వివరాలను తెలియజేయాలని, అలా చేస్తే తమ డబ్బు తిరిగి వస్తుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే ఖాతాదారుడు ఇష్టపూర్వకంగా తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను వెల్లడించిన పక్షంలో డబ్బు తిరిగి రాదని చెబుతున్నారు.