శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:11 IST)

వారిద్దరి వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ గా పోసాని: అచ్చెన్నాయుడు

సభ్య సమాజం తలదించుకునేలా పవన్ కళ్యాణ్ గారి తల్లి, భార్య, కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదు? రాజకీయ విమర్శలకు రాజకీయంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నడిపే పార్టీ నేతలపై ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలియచేశారు.
 
రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పకుండా దాటవేసి బూతులు, తిట్లతో మహిళా లోకాన్ని బజారుకీడ్చడాన్ని ఏమంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
 
మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో? 2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారింది. డ్రగ్ మాఫియాతో వైకాపా నేతలు చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు దోపిడి చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారు.

ఈ డ్రగ్స్ మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు. విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజీల్ ధరలు, ఇసుక రేట్లు, మద్యం రెట్లు, ఆస్తి పన్ను, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారు.
 
రాష్ట్రంలో దళిత, గిరిజన, మైనార్టీ, బడుగు వ్యవస్థలోని మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. హెరాయిన్ తో పాటు, గంజాయి, గుట్కా, తలనీలాలు, ఎర్రచందనం, బియ్యం, శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలతో దోపిడికి ఆగడాలు నిత్యం పతాక శీర్షికల్లో కనిపిస్తున్నాయి.

ఈ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైకాపా నేతలు కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
బూతులు, జుబుత్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను, ప్రజా ప్రయోజనాలను బలిపెట్టకూడదు. రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజా స్వామ్య స్పూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే సరైన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని మర్చిపోకండి.

కొందరిని కొంత కాలమే మోసం చేయగలరు, ఎల్లకాలం మోసం చేయలేరన్న లోకోక్తిని గుర్తు తెచ్చుకోవాలి. వైకాపా నేతల వికృత బూతులను ఖండించాల్సిందిగా ప్రజలు, మేధావులు, ప్రజా స్వామ్య వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ పిలుపునిచ్చారు.