గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (07:26 IST)

ఏపీలో నేటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు

సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక‌ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే ఈ నెల 2 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి విదితమే.

విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటంతో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. 8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి  6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. 

ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు.