బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (16:31 IST)

జగన్‌లా కాళ్లు పట్టుకోను.. పవన్ :: పోటీలో ఉన్నానంటున్న వర్మ

తాను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలా కాళ్లు పట్టుకునే రకం కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా, చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తూ, ఏపీలో కేవలం రెండు కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేయాలా? సామాన్యులకు రాజకీయం అవసరం లేదా? అని నిలదీశారు. 
 
శాసనసభ గడప కూడా తొక్కని నాయకుడు మనకు అవసరమా? అని అడిగారు. చంద్రబాబు, జగన్‌లను సైతం మన పార్టీకే ఓటు వేయాలని అడుగుతున్నానని చెప్పారు. వైసీపీ అంటే టీడీపీకి భయమని... వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ పార్టీ అని అన్నారు. సైకిల్ పాతబడిపోయిందని... ఫ్యాన్ తిరగాలంటే పవన్ (విద్యుత్) మనం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగానే పెట్టుకుంటానని, జగన్ మాదిరిగా దొడ్డిదారిన వెళ్లి ప్రధాని మోడీ కాళ్లను తాను పట్టుకోనని అన్నారు. 
 
మరోవైపు, తాను కూడా భీమవరం ఎన్నికల బరిలో ఉన్నట్టు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ రెండు ట్వీట్లు చేశారు. తాను ఎన్నికల బరిలో ఉన్నానని, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. నామినేషన్లకు గడువు ముగిసినా, తనకు ఉన్నతాధికారుల నుంచి పోటీ చేసేందుకు అనుమతి లభించిందన్నారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాలని చెప్పారు. ఈ ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.