1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:18 IST)

గుడికొక గోమాత: టిటిడి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 28 దేవాల‌యాల్లో గుడికో  గోమాత  కార్య‌క్ర‌మాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో క‌లిసి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క మండ‌లి స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీర్మానించింది. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేయ‌నున్నారు.

తెలంగాణ‌లోని పాత 10 జిల్లాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాల్లో  జిల్లాకు ఒక ఆల‌యం చొప్పున‌, క‌ర్ణాట‌క రాష్ట్రంలోని 5 దేవాల‌యాల్లో క‌లిపి మొత్తం 28 ఆల‌యాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు.

టిటిడి ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ద్వారా దేశ‌వాళీ ఆవుల దానాన్ని స్వీక‌రించాల‌ని తీర్మానించారు. మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య ప‌ర్య‌వేక్ష‌ణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా గోవును టిటిడి అంద‌జేస్తుంది.

గోదానం పొందిన సంబంధిత ఆల‌యాలు, పీఠాలు, వేద‌పాఠ‌శాల‌లు గోవుల సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుంది. టిటిడి ద్వారా దానం పొందిన గోవుల వ‌ద్ద గుడికో గోమాత - టిటిడి అనే బోర్డు త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ముంద‌స్తు అనుమ‌తితోనే భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మానికి గోవుల‌ను దానం చేయాల్సి ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన విధి విధానాలు, గోదానం, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల డైరెక్ట‌ర్ నుంచి పొంద‌వ‌చ్చు. 
 
ఈ స‌మావేశంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శివ‌కుమార్‌, గోవింద‌హ‌రి, డిపి.అనంత‌, జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఎస్వీ గోసంర‌క్ష‌ణశాల డైరెక్ట‌ర్ డా. హ‌ర‌నాథ‌రెడ్డి పాల్గొన్నారు. హెచ్‌డిపిపి కో-అప్ష‌న్ స‌భ్యులు బొమ్మ‌దేవ‌ర సుబ్బారావు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశంలో పాల్గొన్నారు.