1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (10:47 IST)

ఏపీ మున్సిపల్ ఎన్నికలు : క్లీన్ స్వీప్ దిశగా వైకాపా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైకాపా పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. ముఖ్యంగా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప, కమలాపురం నగర పంచాయతీ ఫలితాలు ఆ దిశగానే ఉన్నాయి. 
 
ఇప్పటివరకూ వెలువడిన అన్ని వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇప్పటికే 9, 10, 11, 14, 15, 16, 17, 20 వార్డుల ఫలితాలు వెలువడగా.. తాజాగా 2, 3, 7, 8 వార్డుల ఫలితాలు వచ్చేశాయి. 
 
2వ వార్డులో వైసీపీ అభ్యర్థి మహ్మద్ సాధిక్ 324 ఓట్లతో విజయం సాధించారు. 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి మునిరెడ్డి 16 ఓట్లతో గెలుపొందగా.. కమలాపురం 7వ వార్డులో వైసీపీ అభ్యర్థి రాజేశ్వరి 29 ఓట్లతో విజయం సాధించారు. 3వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూరి 234 ఓట్లతో గెలుపొందారు. 
 
మరోవైపు, కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 13, 15, 16 వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మూడు వార్డులోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 
 
3వవార్డు టీడీపీ అభ్యర్థిని ఎన్ కుమారి 75 ఓట్ల మెజార్టీతో, 15వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 92 ఓట్లతోను, 16వ వార్డు టిడిపి అభ్యర్థి గోపాల్ 118 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా రాజంపేటలో మొత్తం 29 వార్డులకు గాను.. 20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వాటిలో వైసీపీ 16 వార్డులను సొంతం చేసుకోగా.. టీడీపీ 3, ఇండిపెండెంట్ 1 వార్డును కైవసం చేసుకున్నాయి. 
 
కాగా.. రాజంపేట 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి గుగ్గిళ్ల చంద్రమోళి విజయం సాధించారు. 27వ వార్డులో ఇండిపెండెంట్ రాఘవరాజు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. రాజంపేట 19 వ వార్డులో వైసీపీ అభ్యర్థి డొంక సురేశ్, 21వ వార్డులో వైసీపీ అభ్యర్థి కొండా వెంకట రమణ రెడ్డి గెలుపొందారు. 
 
అలాగే, 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి చప్పిడి శ్వేతారెడ్డి 300 మెజార్టీతో విజయం, 4 వవార్డులో వైసీపీ అభ్యర్థి రవి 50 ఓట్లు మెజార్టీ, రాజంపేట 17వ వార్డులో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి 600 ఓట్లతో విజయం సాధించారు.