బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...
రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర గడువు ముగిసేలోపు పోలీసులకు లేదా రాజమండ్రి అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ కుమార్కు హైకోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది.
న్యాయస్థానం నిబంధనల ప్రకారం మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ లొంగిపోవాలి. అయితే, ఆయన సాయంత్రం వరకు లొంగిపోలేదు. పైగా, తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను పొడగించాలని మరో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన గడువులోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని హెచ్చరించింది. చెన్నైలో ఉంటే విమానంలో అయినా వచ్చి లొంగిపోవాలని ఆదేశించింది. కానీ, ఆయన మాత్రం లొంగిపోలేదు.
ఇదిలావుంటే, తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ నెల 1వ తేదీన మధ్యంతర బెయిల్ గడువును బోరుగడ్డ అనిల్ పొడగించుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు.