గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (07:20 IST)

చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ .. తెదేపా మేనిఫెస్టో రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం టీడీపీ ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిపై వైకాపా నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఎస్ఈసీ.. అన్ని అంశాలను పరిశీలించి మేనిఫెస్టోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పల్లె ప్రగతి-పంచ సూత్రాలు పేరిట తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టో తీసుకువచ్చింది. అయితే, ఈ మేనిఫెస్టో రాజ్యాంగ విరుద్ధం అంటూ అనేక విమర్శలు వచ్చాయి. పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు పార్టీ తరపున మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారన్న వాదనలు వినిపించాయి.
 
దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మేనిఫెస్టో విడుదలపై టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.