1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:27 IST)

అమరావతి నిర్మాణం జరిగి వుంటే రూ.2లక్షల కోట్ల సంపద... సజ్జల ఓ బ్రోకర్: చంద్రబాబు

రెండున్నరేళ్ల పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పిచ్చి తుగ్లక్ అని చిన్నప్పుడు చదువుకున్నానని, ఇప్పుడు పిచ్చి జగన్ ను చూస్తున్నాని ఎద్దేవా చేశారు. తుగ్లక్ జుట్టు మీద పన్ను వేస్తే జగన్ చెత్త మీద పన్ను వేస్తున్నాడని దుయ్యబట్టారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం కనిగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా మాల్యాద్రి, పెద్ద ఎత్తున వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పార్టీ ఇంచార్జి ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వారందరికీ చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  రాష్ట్రంలో ఉన్నవన్నీ జగన్ రెడ్డి బ్రాండ్లేనని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను లిక్కర్ బ్రాండ్లకు పేర్లు పెట్టారని విమర్శించారు. 
 
ఇంకా ఏమన్నారంటే... ‘‘40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. సమైక్యాంధ్రలో అందరికంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేశాను. తెలుగు జాతి గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ దగ్గర పనిచేయడమే కాకుండా శిక్షణ కూడా తీసుకున్నాను. జగన్ పాలనలో అవినీతి, విధ్వంసం తప్ప మరొకటి లేదు. పిచ్చి నిర్ణయాలతో దొంగ పాలన చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడకుంటే చివరకు ఏమీ మిగలదు.

నా ఆవేదన పదవి కోసం కాదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఈ రాష్ట్రం ఏమౌతుందో, యువత భవిష్యత్ ఏమవుతుందనే నా బాధ. డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి నేరుగా రాష్ట్రానికి వస్తున్నాయి. తాలిబన్ల నుండి తాడేపల్లికి నేరుగా వస్తున్నాయి. ఎన్ఐఏ విచారణ చేస్తుంటేనే ఓ పత్రిక ఏపీకి సంబంధం లేదని సర్టిఫికేట్ ఇస్తోంది. ఎవరికోసం హెరాయిన్ తెచ్చారు..ఎవరు తెచ్చారు.?

సుధాకర్ అనే వ్యక్తి చెన్నైలో వుంటే నేరుగా ఆఫ్ఘనిస్తాన్ కు అడ్రస్ పెట్టారంట. మామూలు వ్యక్తులకు ఆఫ్ఘనిస్తాన్ తెలుసా.? లిక్కర్ విషయంలో చరిత్రలో ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా.? తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఏపీలో లేవు.. డబ్బు పిచ్చితో ఆడబిడ్డల మంగళసూత్రాలు తాకట్టుపెట్టే హక్కు జగన్ కు ఎవరిచ్చారు.? అప్పులు చేసి, తాగే ఆదాయంపైనా అప్పులు తెచ్చారు.

మద్య నిషేధమని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఇప్పుడు ఇష్టం లేకపోయినా 15 ఏళ్ల పాటు తాగించేలా ఒప్పందం చేసుకున్నారు. తెచ్చిన అప్పులు కట్టడానికి మాత్రమే తాగిస్తున్నాడు. ఏపీలో ఉన్న మందు తాగితే చచ్చిపోతారని తెలంగాణ, ఒడిశా, కర్ణాటక నుండి మద్యం తెచ్చుకుంటున్నారు. గ్రామాల్లో కొందరు నాటుసారా, గంజాయి తెచ్చుకుని తాగుతున్నారు. ఇప్పుడు రూ.72 వేల కోట్లు విలువ చేసే హెరాయిన్ రాష్ట్రానికి తెచ్చారు.

జనం చెవిలో పువ్వులు పెట్టిన జగన్ కు..జనమంతా కలిసి జగన్ చెవిలో పువ్వులు పెట్టాలి. ప్రభుత్వ అసమర్థపై మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు. కాకినాడలో తగలబడిన బోటుపై విచారణ చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర అడిగితే ఇంటికొచ్చి నోటీసు ఇచ్చారు. దొంగలు, స్మగ్లర్లను పట్టుకోకుండా ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడుతున్నారు. ఒక్కసారి అని ఛాన్స్ అడిగి కరెంటు తీగపట్టుకుంటే ఏమవుతుందో అయ్యే స్థితికి తీసుకొచ్చారు.

కరెంటు రాదు కానీ, కాలిపోయేలా బిల్లులు మాత్రం వస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ట్రూ అప్ ఛార్జీలు కొత్త పేర్లతో బిల్లులు వసూలు చేస్తున్నారు. పేదలకు కొత్త ఇళ్లు కట్టడు, మనం కట్టిన ఇళ్లు ఇవ్వడు. సామాన్యుడు ఇసుక కొనే పరిస్థితి రాష్ట్రంలో లేదు. డ్రాక్వా సంఘాల గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఎక్కడుంది..? డ్వాక్రా సంఘాల సృష్టికర్తను నేను.

నా మానసపుత్రిక డ్వాక్రా సంఘాలు. డ్వాక్రా సంఘాలను నేను అభివృద్ధి చేయలేదంట..ఆయన చేస్తారంట. రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2000 వేలు చేశాను. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని మూడేళ్లైనా హామీ నెరవేర్చలేదు. పెన్షన్, రేషన్ కార్డులు దుర్మార్గంగా తొలగిస్తున్నారు. మన పోరాటం పార్టీ కోసం, మన కోసం కాదు. రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలి.

రాష్ట్ర, భావితరాల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే చాలా సమయం పడుతుంది. రాష్ట్రం అప్పులపాలైంది. ఆస్తులకంటే మించిన అప్పులు చేస్తున్నారు. ఏ కార్పొరేషన్ లోనూ డబ్బులు లేకుండా చేశారు. టీడీపీ హాయాంలో పుట్టినప్పుడు నుండి వ్యక్తి చనిపోయే వరకు, ఆరోగ్యానికి, చదువుకు, పెళ్లిళ్లకు అవసరమైన పథాకాలన్నీ పెట్టాం. అన్నక్యాంటీన్లు, చంద్రన్నబీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య, సీఎం సహాయనిధి రద్దు చేశారు. సబ్ ప్లాన్ లు రద్దు చేశారు.

ఆరోగ్య శ్రీ లేదు. రద్దు చేసిన చిట్టా రోజంతా చదవొచ్చు. రాష్ట్రం కోలుకోవాలంటే టీడీపీ రావాలి. రూ.2 లక్షల కోట్ల ఆస్తి రాజధాని అమరావతిలో వుంది. ఇది ఒకరికి చెందినది కాదు..రాష్ట్రానికి చెందినదిహైదరాబాద్ ను అభివృద్ధి చేయడం వల్ల రూ.20 వేల విలువ చేసే భూమి రూ.60 కోట్లకు చేరింది. రూ.2 లక్షల కోట్ల ఆస్తిని కుక్కల పాలు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ప్రకాశంజిల్లాకు నీరందించేందుకు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుని నేనే శంకుస్థాపన చేశా.

పోలవరం పూర్తై వుంటే పశ్చిమ ప్రకాశానికి ఈపాటికి నీరందేది. గోదావరి – కృష్ణా నదులను అనుసందానం చేశాం. గోదావరి-పెన్నా నదుల అనుసందానానికి రూపకల్పన చేశాం. రాయలసీమ, ప్రకాశం, రాష్ట్రంలోని మెట్టప్రాంతాలకు నీరందించాలని సంకల్పించాం. ఈరోజు మొత్తం పోగొట్టి వీళ్లూవీళ్లూ కొట్టుకుని పెత్తనాన్ని కేంద్రానికి ఇచ్చారు. ఇప్పుడు కాల్వ తవ్వాలన్నా కేంద్రం అనుమతి కావాలి.

భూసేకరణ, పునరావాసంతో కలిపి పోలవరానికి రూ.55 వేల కోట్లు రావాల్సి వుంది. కానీ కేంద్రం రూ.25వేల కోట్ల కంటే ఎక్కువ  మేము ఇవ్వమని మాట్లాడుతుంటే అడిగే దమ్మూ, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. దక్షిణ భారతంలో వెనకబడిన రాష్ట్రాన్ని బీహార్ గా మారుస్తున్నాడు. వైసీపీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి. మీ పోలీసులకు మేము భయపడతామనుకున్నారా.?

చట్ట వ్యతిరేకంగా పనిచేసిన కొందరు పోలీసులకు ఏనాడైనా శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించినా శిక్షకు అర్హులవుతారు. కార్యకర్తలంతా ధైర్యంగా పార్టీకోసం పనిచేయండి. పార్టీకి పనిచేయని వారిని తప్ప..పనిచేసే నాయకులను మార్చే అవకాశమే లేదు. పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు వుంటుంది. ఉగ్రనరసింహారెడ్డిని మెజార్టీతో గెలిపించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.