శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (17:38 IST)

వ‌రుస‌కు బాబాయే... చిన్నారిపై అత్యాచారం, హ‌త్య

వ‌ర‌స‌కు బాబాయే... ఆ చిన్నారిపై అత్యాచారం జ‌రిపి హ‌త్య చేశాడు. పోలీసులు ఈ కేసును చాక‌చ‌క్యంగా ప‌రిశోధించి... బాబాయికి అర‌దండాలు విధించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో  ఏడు సంవత్సరాల చిన్నారి ఖాసింబిపై అదే గ్రామానికి చెందిన వరుసకు బాబాయి అయ్యే సిద్దయ్య అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు.

కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. అంబవరం గ్రామానికి చెందిన ఖాసింవలికి ముగ్గురు పిల్లలు. ఖాసింబి ఖాసింవలికి మూడో సంతానం. ఖాసింవలి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో వారి కుటుంబంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో దూదేకుల సిద్దయ్య ఖాసింబిని మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం పాప ఎవరికైనా చెపుతుందేమో అని గొంతును నులిమి అతి కిరాతకంగా బండకేసి మోది చంపాడు.
 
తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా చిన్నారి మృతదేహాన్ని ఒక గోతంలో కుక్కి, గ్రామ సమీపంలోని ఓ అరటి తోట వద్ద పడవేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో మరుసటి రోజు సాయంత్రం ఓఅరటి తోట సమీపంలో చిన్నారి గోతంలో శవమై తేలింది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ కిషోర్ కుమార్ సీఐ ఫిరోజ్ క్లూస్ సేకరించారు.

పాప శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. పోలీస్ డాగ్ నిందితుడి ఇంటి వద్దకు వచ్చి ఆగడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అప్పటికే నిందితుడు పరారు కావడంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
దిశ డీఎస్పీ ధనుంజయ్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, దూదేకుల సిద్దయ్య మద్యానికి బానిసై అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. సిద్ధయ్యకు నాలుగు సంవత్సరాల క్రితమే వివాహమై ఒక కూతురు కూడా ఉందని ఇతని ప్రవర్తనతో విసిగి పోయిన భార్య కూతుర్ని తీసుకొని తన పుట్టింటికి వెళ్లి పోయిందని తెలిపారు. పాత కక్షలు మనసులో పెట్టుకొని సిద్దయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, స్వయంగా సిద్దయ్య నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు. సిద్దయ్యపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిఎస్పీ ధనుంజయ్ తెలిపారు.