శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (16:13 IST)

బీకాం చ‌ద‌వ‌క‌పోయినా... త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని అశోక్ బాబుపై సిఐడి కేసు

ఏపీ ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పి.ఆర్.సి. గురించి మాట్లాడుతున్న‌టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఎట్ట‌కేల‌కు వేటుప‌డుతోంది. ఆయ‌న‌పై సి ఐ డి కేసు నమోదు అయింది. త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, అశోక్ బాబుపై సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. 
 
 
అశోక్ బాబు అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేసే సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేసు పెట్టారు. కొంతమంది అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి, అశోక్ బాబు రికార్డులను ట్యాంపరింగ్ చేశార‌ని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చారని మేహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్న లోకాయుక్త దీనిపై కేసు పెట్టాల‌ని నిర్ణ‌యించింది.
 
 
2021 ఆగస్టులో అశోక్ బాబు కేసును సిఐడికి అప్పగించాలంటూ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. ఏమి చర్యలు తీసుకున్నారో కూడా తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డర్ లో పేర్కొంది. అయితే, అపుడు అశోక్ బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సిఐడికి ఫిర్యాదు చేసింది. గీత మాధురి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో కూడా తాను గ్రాడ్యుయేట్ అంటూ తప్పుడు సమాచారం ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.