శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (16:43 IST)

ఆన్‌లైన్‌లో బెట్టింగులు.. ఇదేంటి అని మందలిస్తే.. ఆత్మహత్య.. ఎవరు..?

తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో కుర్రకారు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్నాడు. క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టాడు.

ఇంట్లో జరిగిన ఓ చిన్న ఘటనతో మనస్తాపం చెందిన ఆ కుర్రాడు, ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి మరీ ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 
గుంటూరు మంగళదాస్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల ఆర్ విజయసాయి అనే కుర్రాడు వడ్డేశ్వరంలోని ఓ యూనివర్శిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంట్లోనే ఉంటూ రోజూ కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. అయితే ఏప్రిల్ 16వ తారీఖున అతడు చేస్తున్న ఓ నిర్వాకం బయటపడింది. సోదరి గమనించడంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 16వ తేదీ రాత్రి ఆన్‌లైన్‌లో బెట్టింగులకు పాల్పడుతుండగా అతడి సోదరి చూసింది. 
 
ఇదేంటని మందలించింది. పద్ధతి మార్చుకోమని హెచ్చరించింది. ఈ అలవాట్లు మంచివి కావనీ, చెడు వ్యసనాలకు దారితీస్తుందని హితవు చెప్పింది. అయినప్పటికీ విజయసాయి వినిపించుకోలేదు. పైగా సోదరిపైనే చేయి చేసుకున్నాడు. దీంతో ఈ విషయం కాస్తా ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసింది. తల్లిదండ్రులు కూడా విజయసాయిని మందలించారు.
 
పద్ధతి మానుకోకపోతే చదువు మాన్పించేస్తానని హెచ్చరించాడు. దీంతో విజయసాయి మనస్తాపం చెందాడు. గురువారం కాలేజీకి అని వెళ్లిన విజయసాయి యూనివర్శిటీ సమీపంలోనే ఉండే సుదీక్ష రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో ఉండే స్నేహితుడి రూమ్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయసాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.