1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (09:21 IST)

భూసేకరణ త్వరగా పూర్తి చేయండి: జగన్‌

వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌  మాట్లాడుతూ పాత వైద్యకళాశాల్లో అభివృద్ధి పనులు, కొత్త కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్‌  15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ఆస్పత్రులకోసం భూ సమీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఆ తర్వాత పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నారు.

భవనాలను కట్టడమే కాదు, వాటిని మెరుగ్గా నిర్వహించడం, పరిశుభ్రంగా ఉంచడం అన్నది చాలా ముఖ్యమని తెలిపారు. ఆస్పత్రులు కట్టిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేయడకూడదని.. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక తయారు చేయాలన్నారు.

నిర్దేశిత సమయంలో తీసుకోవాల్సిన చర్యలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని.. పరిపాలనా అనుమతులు, అవసరమైన సిబ్బంది నియామకాల కోసం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబిస్తూ.. 10,011 వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ కల్లా పూర్తిచేయడానికి చురుగ్గా పనులు చేస్తున్నామని వివరించారు.

1133 పీహెచ్‌సీల్లో 151 కొత్తవాటి నిర్మాణం, 982 పాతవాటి పునరుద్ధరణ పనులను అక్టోబరు కల్లా పూర్తిచేస్తున్నామని తెలిపారు.  ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను డిసెంబర్‌ కల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ తదితర పనులు రూపేణా 3.1 కోట్ల చదరపు అడుగుల మేర నిర్మాణాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

బీజింగ్‌ ఎయిర్‌పోర్టుతో పోలిస్తే నాలుగు రెట్లకుపైగా, బుర్జ్‌ ఖలీఫా భవనం కన్నా ఆరు రెట్లకు పైగా నిర్మాణాలతో సమానమని వివరించారు. అనంతరం కోవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించగా.. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.04 శాతం.. మరణాల రేటు రూ. 0.81 శాతమని.. రాష్ట్రంలో 1.30 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు  పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి ఆరా తీయగా.. దానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.
 
ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ వ్యవస్థపై  సమీక్ష...
విలేజ్, అర్బన్‌ హెల్త్‌క్లినిక్స్‌లో ఉన్నవారికీ, పీహెచ్‌సీల్లో ఉన్న సిబ్బందికి శిక్షణపై సీఎం జగన్‌ వివరాలు కోరారు. రిఫరెల్‌ వ్యవస్థసై తగిన అవగాహన, పరిజ్ఞానం సిబ్బందికి వచ్చేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఆశావర్కర్లకు కూడా అవగాహన కల్పించాలన సీఎం తెలిపారు. అనంతరం రిఫరెల్‌ వ్యవస్థకు సంబంధించి ఏఎన్‌ఎం, ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై వర్క్‌ఫ్లోను అడిగి తెలుసుకున్నారు. ఎంపానల్డ్‌ ఆస్పత్రులపై పూర్తి అవగాహన ఉండాలని, రోగులకు సరైన మార్గనిర్దేశం చేసేలా సిబ్బందిని తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యంకోసం పెద్ద మొత్తంలో పేదలు డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తకూడదని.. వెయ్యి రూపాయల దాటితే ఉచితంగా చికిత్స అందించాలనే ప్రభుత్వ విధానం సమర్థవంతంగా అమలు కావాలంటే... సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు.

ఆరోగ్యశ్రీలో లబ్ధిదారుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. ఆరోగ్య ఆసరా అందిందా లేదా తనిఖీ చేయాలని.. ఎంపానెల్‌ ఆస్పత్రిలో ఏదైనా సమస్యవస్తే రియల్‌ టైం డేటా ఉన్నతస్థాయికి రావాలని పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించామన్న అధికారులు తెలపగా.. ప్రతి ఆరోగ్య మిత్ర వద్దా తప్పనిసరిగా ఫోన్‌ ఉంచాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.

104, 108 వాహనాలు ఎప్పటికీ కొత్తగానే కనిపించాలని జగన్‌ పేర్కొన్నారు.  వాటి నిర్వహణలో ఎప్పుడూ రాజీ పడొద్దని.. వాహనాల కండిషన్, వాటి నిర్వహణ అత్యంత ముఖ్యమని అధికారులకు వివరించారు. అనంతరం పల్లెకు డాక్టర్ల వ్యవస్థలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించగా.. గతంలో ఇచ్చిన ఆదేశాలపై వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు వివరించారు.

ఇతర రాష్ట్రాల్లోని వ్యవస్థలను, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు తయారు చేయాలని సీఎంపేర్కొన్నారు.  ప్రజలకు చేరువగా, నేరుగా పల్లెల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా విధానం ఉండాలని తెలిపారు.

ఆరోగ్య శ్రీని సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, క్రమం తప్పకుండా ఎంప్యానెల్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు.