ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (09:55 IST)

నెల రోజుల్లో కోటి మందికి కరోనా టీకాలు : ప్లాన్ సిద్ధం చేసిన ఏపీ సర్కారు!

ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అభివృద్ధి చేసిన టీకాలు ఈ నెలాఖరు నుంచి దేశంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ టీకాల పంపిణీకి అటు కేంద్రం, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, టీకాల పంపిణీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎన్నికల ప్రణాళికను అమలు చేయాలని కేంద్రం భావిస్తోది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా, తొలి 30 రోజుల్లో కోటి మందికి కరోనా టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే, తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని, తొలి డోస్ తీసుకున్నాక 8 వారాలు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
 
మరోవైపు, కరోనా టీకాలు వేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 4,762 కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, ప్రతి కేంద్రంలో ఇద్దరు చొప్పున మొత్తం 9,724 మంది వ్యాక్సినేటర్లను అందుబాటులోకి తేనున్నారు. వీరంతా ఒక్కొక్కరూ రోజుకు 70 మందికి టీకా వేసినా నెల రోజుల్లోనే కోటి మందికి టీకాలను వేయించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేటు, ఆరోగ్య రంగంలో ఉన్నవారితో పాటు అంగన్ వాడీ కార్యకర్తలు మొత్తం 3.66 లక్షల మందికి పైగా ఉండగా, వీరందరికీ తొలుత టీకా అందనుంది. వీరి తర్వాత పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులు ఉంటారు. టీకా తీసుకున్న తర్వాత యాంటీ బాడీలు శరీరంలో పెరిగి, కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి కలిగేంత వరకూ మాస్క్‌లు, భౌతికదూరం వంటివి పాటించడం తప్పనిసరని హెచ్చరించారు. 
 
ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సమస్యలైనా ఏర్పడితే వెంటనే వారికి తగు వైద్య చికిత్సలను అందించేందుకూ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ డాక్టర్లు, బీడీఎస్ వైద్యులు, ఫార్మాసిస్ట్‌లు, నర్సింగ్, ఏఎన్ఎం విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. మొత్తం కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏపీ సర్కారు ఓ భారీ ప్రణాళికనే సిద్ధం చేసింది.