1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:16 IST)

రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వర‌కు కర్ఫ్యూ కొనసాగింపు:జగన్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. కోవిడ్ నివారణ చర్యలపై, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం తాడేపల్లి క్యాపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలని అధికారులకు సీఎం తెలిపారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై ఒక ఆలోచన కూడా చేయాలని అధికారులకు సూచించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన తర్వాత ఏ రకంగా అడుగులు ముందుకేయాలనే దానిపై సరైన ఆలోచనలు చేయాలన్నారు.

నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తామమని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు అమల్లో ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖను సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్‌ అన్నారు. బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని, ప్రభుత్వ ఆసత్పుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ఈమేరకు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.