శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (19:06 IST)

బాణాసంచా త‌యారీ కేంద్రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాలి.. జ‌గ‌న్ ఆదేశాలు

తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆరా తీశార‌ని, గడ‌చిన 20 రోజుల్లో 2 ప్రమాదాలు జరగడంపై సీఎం జ‌గ‌న్ చర్చించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు.

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణాసంచా తయారీ కేంద్రాల్లో వెంటనే తనిఖీలు చేయాలని సీఎం ఆదేశాలిచ్చార‌ని పేర్కొన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో లోపాలు ఉంటే వెంటనే సీజ్ చేయాలని, వేమవరం ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకోవాలని అలాగే బాణసంచా తయారీ కేంద్రాల్లో అనుమతులపై ఫైర్, పోలీస్ శాఖ‌లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సీఎం ఆదేశించిన‌ట్లు తెలిపారు.

ప్ర‌భుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లోపాలు ఉన్నా ఉపేక్షించేది లేద‌న్నారు. దీపావళి పండ‌గ నేపథ్యంలో బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, అమ్మకాల వద్ద భద్రతా ప్రమాణాలపై నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించామ‌న్నారు.

శుక్ర‌వారం జ‌రిగిన ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంద‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు వెల్ల‌డించారు.