శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (13:05 IST)

ఆస్తి పన్ను జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేసిన 'గద్దె'

ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం జారీ చేసిన 196, 197, 198 జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ శాసనసభ్యులు గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెల్లవారుజామున ఆటోనగరులోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోగిమంటలు వేసి 196, 197, 198 జీవో కాపీలను దహనం చేశారు.
 
ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే ప్రజలపై పైసా భారం పడుకుండా పరిపాలన చేస్తానని రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలన చేతకాక అన్నింటిపై పన్నులు పెంచుతూ మాట తప్పి, మడమతిప్పి పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు 196 , 197 , 198 జీవోలను తెచ్చి ఏప్రిల్ ఫస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఇంటి పన్నులు పెంచేందుకు రంగం సిద్ధం చేశారని, దానితో పాటు నీటిపన్ను , డ్రైనేజీ పన్నులు కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం నగర ప్రజలపై పెనుభారాలు మోపడేమనన్నారు. 
 
ఆస్తి విలువలో 0.5 నుంచి 2 శాతం వరకు ఇంటి పన్ను పెంచే అవకాశం ఉందని దానివల్ల గతంలో కంటే 10 నుంచి 15 రెట్లు ఇంటి పన్నులు పెరిగే అవకాశం ఉందని గద్దె రామమోహన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలనలో ఎటువంటి పన్నులు పెంచలేదని, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అన్ని రకాల పన్నులు పెంచుతున్నారని గద్దె రామమోహన్ విమర్శించారు. 
 
ప్రజలు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న ఇటువంటి తరుణంలో ఆస్తి పన్ను పెంచడం దారుణమని, మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉందన్నారు. ఆస్తి పన్ను జీవోలను విరమించుకోవాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ జీవోలను ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తుందని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
 
ఈ కార్యక్రమంలో జాస్తి సాంబశివరావు, కేశినేని శ్వేత , ఎస్ . ఫిరోజ్ , నందిపాటి దేవానంద్ , దేవినేని అపర్ణ , బేతు రామమోహన్, అప్పరబోతు రాము తదితరులు ప్రసంగించి ఆస్తి పన్ను జీ.వోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
 
 
ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ, పేరేపి ఈశ్వర్, ముమ్మనేని ప్రసాద్, కొర్రపాటి సురేంద్ర, పడాల గంగాధర్, వేముల దుర్గారావు, సొంగా సంజయ్ వర్మ, మాదాల రాజ్యలక్ష్మీ , చిట్టా నిర్మల, డి . శాంతకుమారి, ఎం.సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.